అమెరికాలో నగరవాసి అనుమానాస్పద మృతి

8 Oct, 2019 05:23 IST|Sakshi

భర్త వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుందంటున్న మృతురాలి తండ్రి

నాగోలు: నగరానికి చెందిన ఓ మహిళ అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. భర్త వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగోలు సాయినగర్‌కాలనీకి చెందిన గజం కృష్ణయ్య–పారిజాత దంపతుల రెండో కూతురు వనిత (30)కు కొత్తపేటకు చెందిన రాచకొండ శివకుమార్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శివకుమార్‌ అమెరికాలో నార్త్‌ కరోలినాలో నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నాలుగేళ్ల క్రితం ఇండియాలో ఉందామంటూ పిల్లలు, భార్యతో కలసి శివకుమార్‌ నగరానికి వచ్చాడు.

15 రోజుల తర్వాత ఇద్దరు పిల్లలను తన తల్లిదండ్రుల వద్ద ఉంచి, భార్యను పుట్టింటిలో వదిలి అన్నీ సెటిల్‌ చేసుకొని వస్తానంటూ అమెరికా వెళ్లిపోయాడు. భార్యకు తెలియకుండానే ఇటీవల పిల్లలను అమెరికా తీసుకెళ్లాడు. అప్పటి నుంచి భార్యకు ఫోన్‌ చేయడంగానీ, అమెరికాకు తీసుకెళ్లేందుకుగానీ ప్రయత్నించలేదు. పెద్దల ఒత్తిడితో 4 నెలల క్రితం శివకుమార్‌ వీసా పంపడంతో ఆమె అమెరికా వెళ్లింది. కానీ శివకుమార్‌ తిరిగి భార్యను వేధించసాగాడు.

భర్త వేధింపులు ఎక్కవ కావడంతో అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 4న సాయంత్రం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ప్లాస్టిక్‌ కవర్‌ను తొడు క్కొని ఊపిరి ఆడకుండా చేసుకుని మృతి చెందినట్లు కృష్ణయ్య తెలిపారు. శివకుమార్‌ వేధింపుల కారణంగానే తన కూతురు వనిత మృతి చెందిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎల్‌బీనగర్‌ సీఐని కృష్ణయ్య కోరారు. కూతురి మృతదేహాన్ని నగరానికి త్వరగా తీసుకొచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు