హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి తనకు బాధ కలిగించిందన్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే చాలా భయంకరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలో తనకు హరికృష్ణ అత్యంత ఆప్తుడని పేర్కొన్నారు. హరికృష్ణకు డ్రైవింగ్ అంటే ఇష్టమని, మంత్రిగా ఉన్న సమయంలో కూడా సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లేవాడని తెలిపారు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి పట్ల బాధ వ్యక్తం చేశారు. హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ తనను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసేవారని, హరికృష్ణ తనను బాబాయి అని పిలిచేవాడని గుర్తు చేసుకున్నారు. చాలా హుందా గల మనిషి, హృదయం ఉన్న మనిషి, నిజాయతీ కలిగిన వ్యక్తి అకాల మరణం చెందడం తనకు బాధ కలిగించిందని వెల్లడించారు.