ప్రియుడిపై ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఫిర్యాదు

15 Oct, 2019 08:31 IST|Sakshi

తమిళనాడు,టీ.నగర్‌: తనతో వివాహానికి నిరాకరిస్తున్నట్లు ప్రేమికుడిపై ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆదివారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చెన్నై విరుగంబాక్కంలోని అపార్ట్‌మెంట్‌లో ఐఏఎస్‌ అధికారి ఒకరు నివశిస్తున్నారు. ఈయన 20 ఏళ్ల కుమార్తె అన్నానగర్‌లోని ఒక ప్రముఖ పాఠశాలలో ప్లస్‌టూ వరకు పూర్తిచేసింది. అదే పాఠశాలలో ఆమెతో పాటు ఇర్ఫాన్‌ (21) అనే విద్యార్థి చదివాడు. పాఠశాల నుంచి ఇరువురూ స్నేహంగా మెలిగారు. ఆమెను వివాహం చేసుకుంటానని తెలుపుతూ వచ్చిన అతను హఠాత్తుగా నిరాకరించినట్లు సమాచారం.

దీంతో ఐఎఎస్‌ అధికారి కుమార్తె ఆదివారం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇర్ఫాన్‌ లెదర్‌ గార్మెంట్స్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. కళాశాల విద్యార్థి కూడా. టీ.నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌కుమార్‌ ఇర్ఫాన్‌ను విచారించారు. దీనిపై వడపళని మహిళా పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌కు విచారణ చేయాలని ఉత్తర్వులిచ్చారు. ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 417, 420, 406, 506 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

>
మరిన్ని వార్తలు