మహేశ్‌బాబుకు సూసైడ్‌ నోట్‌ రాసి..

27 Apr, 2018 11:53 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న సునంద్‌ కుమార్‌ రెడ్డి(ఫైల్‌)

 ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఎస్‌ఐ చింతకాయల వెంటేశ్‌ తెలిపిన మేరకు.. గుంటూరు సిద్ధార్థ నగర్‌కు చెందిన పులి శ్రీనివాస్‌ రెడ్డి బెంగళూర్‌లో ఆంధ్రాబ్యాంక్‌ మేనేజర్‌గా పని చేస్తూ భార్య మయూరితో కలిసి అక్కడే ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారులు పులి సునంద్‌ కుమార్‌  రెడ్డి(21) ట్రిపుల్‌ ఐటీలో సీఎస్‌డీ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ట్రిపుల్‌ ఐటీ పలాస్‌ నివాస్‌ ఓల్డ్‌ బాయ్స్‌ హస్టల్‌లోని రూమ్‌ నెంబర్‌ 267లో ఉంటున్నాడు. 

బుధవారం రాత్రి స్నేహితుడు సాయి సాహిత్‌ ఫోన్‌ చేస్తే సునంద్‌ స్పందించలేదు. అతను ఇదే విషయాన్ని స్నేహితుడు రోహిత్‌కు తెలియజేశాడు. మధ్యాహ్నం సెమిస్టర్‌ పరీక్ష ఉండటంతో గురువారం ఉదయం 11.45 గంటలకు రోహిత్‌ వెళ్లి సునంద్‌ గది డోర్‌ కొట్టినా స్పందించలేదు. ఎంత పిలిచినా పలకకపోవడంతో కిటీకిలోంచి చూడగా సునంద్‌ బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు సమాచారం అందించారు. ఎస్‌ఐ వెంకటేశ్‌ ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహంతో పాటు రెండు సూసైడ్‌ నోట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఒకటి తన తల్లిదండ్రులకు రాసి ఉంది. ‘అమ్మా.. నాన్న.. నేను ఈ లోకంనుంచి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి. మీరంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మీ తరుఫున బంధువులంటే నాకు ఇష్టం లేదు.. వారు కేవలం అవసరానికి వచ్చి వెళ్లేవారు.. భారతీయ బంధుత్వ వ్యవస్థ బాగా లేదు..’ అని ఒక లేఖలో రాశాడు.

మహేశ్‌.. యు ఆర్‌ మై డాక్టర్‌ 
సునంద్‌ రెడ్డి హీరో మహేశ్‌ బాబుకు వీరాభిమాని. అతని గది నిండా మహేశ్‌ ఫొటోలు అంటించినట్లు పోలీసులు తెలిపారు. ఒత్తిడికి లోనైనప్పుడు గదిలోకి వెళ్లి మహేశ్‌ బాబు సినిమాలు చూస్తాడని స్నేహితులు తెలిపారు. ‘నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మీ సినిమాలే చూస్తాను.. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మీరే నా డాక్టర్‌, మీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు....’ అంటూ రాసిన లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు