ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను

2 Feb, 2019 02:19 IST|Sakshi

సూసైడ్‌ నోట్‌రాసి ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి ఆత్మహత్య

సంగారెడ్డి రూరల్‌: ‘మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను.. ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని లెటర్‌ రాసి మిత్రుడికి మెయిల్‌ చేసిన ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుందని రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజన్‌ కుటుంబం హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో నివాసం ఉంటోంది. రాజన్‌ కుమారుడు అనిరుధ్య (21) కంది ఐఐటీ హైదరాబాద్‌లోని డీ బ్లాక్‌లో గల హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌ కోర్సు ఫైనలియర్‌ చదువుతున్నాడు. కాగా, అనిరుధ్య.. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని లెటర్‌ రాసి గురువారం రాత్రి 12 గంటల సమయంలో మిత్రుడు కనిష్క్‌రెడ్డికి మెయిల్‌ చేశాడు.

అనంతరం హాస్టల్‌ ఏడో అంతస్తు పైకి చేరుకుని భవ నంపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావ డంతో అనిరుధ్యకు ఐఐటీలోని ఆస్పత్రిలో ప్రథమచికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉండగా...  మృతుడి తండ్రి రాజన్‌ మాట్లాడుతూ ఈ మధ్యే తన కుమారుడు సెలవుపై ఇంటికి వచ్చి వెళ్లాడని, ఇంతలోనే ఏం జరిగిందో అంతుబట్టడంలేదన్నారు. ప్రమాదానికి ముందు అనిరుధ్య టెర్రస్‌పైకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఐఐటీ క్యాంపస్‌ సెక్యూరిటీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు