తేడా మొగుడు.. భార్య నగ్న ఫోటోలు తీసి..

3 Sep, 2018 13:07 IST|Sakshi

సాక్షి, కర్నూలు : తన లోపాన్ని ఎవరికైనా చెబితే నగ్న చిత్రాలు బయటపెడతానని కట్టుకున్న భార్యను బెదిరించాడు ఓ సాఫ్ట్‌వేర్‌ భర్త. తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి భార్యకు టీబీ రోగం ఉందని ప్రచారం చేశాడు. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన యువతికి, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మాచాని రాజేంద్రప్రసాద్‌తో గత ఏడాది ఆగస్టు 2న వివాహం అయింది. కట్నంగా 45లక్షల రూపాయలు, వివాహనంతరం మరో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కాగా పెళ్లైన మొదటిరోజే రాజేంద్రప్రసాద్‌ తేడాగా వ్యవహరించాడు. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. తాను నపుంసకుడినని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని అతడి అమ్మమ్మకు తెలుపగా ఆమె కూడా తన మనవడు నపుంసకుడేనని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించింది. దీంతో ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక కుంగిపోయానంటూ బాధితురాలు మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. 

టీబీ రోగం ఉందని ప్రచారం
అత్తింటి వారి ఆగడాలు భరించలేక బయటకు వచ్చినట్లు బాధితురాలు పేర్కొన్నారు. దీంతో తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాధితురాలికి టీబీ రోగం ఉందని రాజేంద్రప్రసాద్‌ ప్రచారం చేశాడు. ‘ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాను. నాకు ఏ రోగం లేదని డాక్టర్లే నిర్ధారించారు. నా భర్తకు పరీక్షలు చేయించమని అత్తింటివారిని అడగ్గా.. అతడు ఎక్కడికి రాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించారు. అమ్మనాన్నలకు చెప్పి పెద్దల సమక్షంలో నిలదీస్తే ఏమి స్పందించకుండా వెళ్లిపోయారు’అని ఆమె అవేదన వ్యక్తం చేశారు. 

మరో పెళ్లికి రెడీ
ఇదిలా ఉండగా మాచాని రాజేంద్రప్రసాద్‌ మరో పెళ్లికి రెడీ అయ్యారు. సమాచారం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను వద్దలొద్దు అంటూ మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. అతడికి శిక్ష పడిన తర్వాతే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తానని చెప్పారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అని పెళ్లి చేశాం : బాధితురాలి తండ్రి
మంచి సంబంధం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమని తమ కూతురుకి డిగ్రీ సెకండియర్‌లోనే వివాహం చేశామని బాధితురాలి తండ్రి తెలిపారు. 45 లక్షలు కట్నంగా, మరో 10లక్షలు అదనంగా ఇచ్చామన్నారు. కానీ అబ్బాయి ఇలాంటివాడు అనుకోలేదని మీడియా ముందు వాపోయారు. ఈ విషయంపై మాట్లాడేందుకు వారి ఇంటికెళ్లిన తన తమ్ముడిని తీవ్రంగా కొట్టారని పేర్కొన్నారు. దీంతో విధిలేక పోలీసులను ఆశ్రయించామన్నారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన రాజేంద్రప్రసాద్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు