జైషే టాప్ కమాండర్ హతం

5 Mar, 2018 20:33 IST|Sakshi
ఇన్ సెట్లో జైషే మహమ్మద్ టాప్ కమాండర్ ముఫ్తీ వకాస్

సాక్షి, శ్రీనగర్: జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ ముఫ్తీ వకాస్ హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని సంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై దాడికి ప్రధాన సూత్రధారి అయిన వకాస్‌ను భారత ఆర్మీ, కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా మట్టుపెట్టాయి. కశ్మీర్‌లోని అవంతీపూర్‌లో ఉగ్రకదలికలు ఉన్నట్లు గుర్తించిన 50 రాష్ట్రీయ రైఫిల్స్ బృందాలు, భారత ఆర్మీ, స్థానిక పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

హతివారాలో జరిపిన ఎన్‌కౌంటర్‌లో సంజువాన్ ఆర్మీ క్యాంపు దాడి ప్రధాన నిందితుడు ముఫ్తీ వకాస్‌ హతమయ్యాడని శ్రీనగర్ ఆర్మీ క్యాంపు అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా మీడియాకు వివరించారు. ఓ ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ ఆపరేషన్‌లో పౌరులెవరికీ ఎలాంటి హానీ జరగలేదన్నారు. నూర్ మహమ్మద్ అనంతరం జైషే ఉగ్రసంస్థకు వకాస్ ప్రధాన కమాండర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

గత నెలలో జమ్మూ నగర శివార్లలోని సంజువాన్‌ ఆర్మీక్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారు.

మరిన్ని వార్తలు