గోల్డ్‌ బార్స్‌తో అక్కడ దొరికిపోయాడు..

9 Aug, 2018 20:13 IST|Sakshi

ఢాకా : భారత్‌కు చెందిన అర్షద్‌ అయాజ్‌ అహ్మద్‌ రూ 4.7 కోట్ల విలువైన బంగారు కడ్డీలతో ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్‌ కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడ్డాడు. థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో థాయ్‌లాండ్‌ నుంచి అర్షద్‌ అహ్మద్‌ ఢాకా చేరుకున్నాడని స్ధానిక మీడియా వెల్లడించింది. ఎయిర్‌పోర్ట్‌ గ్రీన్‌ఛానెల్‌లో సిబ్బంది తనిఖీ చేయగా భారీగా బంగారం పట్టుబడిందని ఢాకా కస్టమ్స్‌ హౌస్‌ డిప్యూటీ కమిషనర్‌ ఒథెల్లో ఛౌధురి తెలిపారు. అహ్మద్‌ నుంచి రూ 4.7 కోట్ల విలువైన 22 గోల్డ్‌ బార్‌లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న అయాజ్‌ను అరెస్ట్‌ చేసి తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు అప్పగించామని బంగ్లా కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. కాగా, ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం తరలిస్తూ పట్టుబడుతున్న ఘటనలు ఇటీవల భారీగా చోటుచేసుకుంటున్నాయని అధికారులు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు