ప్రియురాలిని హత్య చేసి.. శవంతో ప్రయాణం!

16 Mar, 2020 14:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దుబాయ్‌: ప్రియురాలి మీద అనుమానంతో దారుణానికి తెగబడ్డాడో యువకుడు. ఆమెను హత్య చేసి ఏకంగా 45 నిమిషాల పాటు శవంతో ప్రయాణించాడు. ఆఖరికి పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. చేసిన నేరానికి త్వరలోనే శిక్ష అనుభవించబోతున్నాడు. గత జూలైలో దుబాయ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక కోర్టు ఆదివారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ మేరకు... భారత్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో భారత్‌కే చెందిన యువతితో అతడు ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులపాటు సజావుగా సాగిన వీరి బంధంలో అనుమానం చిచ్చు పెట్టింది. తనను కాదని ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడుతోందని భావించిన సదరు యువకుడు.. తరచూ ఆమెతో గొడవపడేవాడు.

ఈ క్రమంలో కారులో తనను తీసుకువెళ్లి... నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం ముదిరి... చివరకు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కోశాడు. కారు ముందు సీట్లో తన శవాన్ని పెట్టుకుని దాదాపు 45 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఓ హోటల్‌లో ఆగి భోజనం చేశాడు. అనంతరం డైరాలోని పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో కేసు ఆదివారం విచారణకు వచ్చింది. 

ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘రక్తం నిండిన దుస్తులతో అతడు పోలీసు స్టేషనులో అడుగుపెట్టగానే నేను షాకయ్యాను. వణుకుతున్న గొంతుతో తన గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేశానని చెప్పాడు. బాధితురాలి మృతదేహం అతడి కారు ముందు సీట్లోనే ఉంది. గొంతు కోసిన ఆనవాళ్లు కనిపించాయి. వెనుక సీట్లో పెద్ద కత్తిని మేం స్వాధీనం చేసుకున్నాం. తనను మోసం చేసిందనే అనుమానంతో ఈ ఘటనకు పాల్పడ్డట్లు నిందితుడు అంగీకరించాడు’’ అని కోర్టుకు తెలిపారు. అదేవిధంగా బాధితురాలి హత్యకు ముందు తనను చంపేస్తానంటూ ఆమె కుటుంబ సభ్యులకు ఇ-మెయిల్‌ పంపినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో సదరు యువకుడికి ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌ లాయర్‌ వాదించారు. ఇందుకు సంబంధించిన తీర్పు త్వరలోనే వెలువడనుంది.

మరిన్ని వార్తలు