మోస్ట్‌ వాంటెడ్‌ ఐఎం ఉగ్రవాది

15 Feb, 2018 01:55 IST|Sakshi

ఆరిజ్‌ఖాన్‌ అరెస్ట్‌

న్యూఢిల్లీ: దేశరాజధానిలో 2008లో వరుస బాంబుపేలుళ్ల కేసులో కీలక సూత్రధారి, ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం)కు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది ఆరిజ్‌ఖాన్‌ అలియాస్‌ జునైద్‌(32)ను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. బాంబు పేలుళ్ల తర్వాత ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న ఆరిజ్‌ఖాన్‌.. పదేళ్ల తర్వాత ఇండో–నేపాల్‌ సరిహద్దులో పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ పేలుళ్లు సహా 165 మంది ప్రజల మృతికి ఆరిజ్‌ కారకుడని స్పెషల్‌ సెల్‌ డీసీపీ ప్రమోద్‌ సింగ్‌ మీడియా సమావేశంలో తెలిపారు.

ఇంజనీర్‌ అయిన ఆరిజ్‌.. బాంబులు తయారుచేయడం, దాడికి ప్రణాళికలు రచించడం, వాటిని అమలు పర్చడంలో సిద్ధహస్తుడని వెల్లడించారు. పాఠశాలలో ఉన్నప్పుడే ఆరిజ్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యారన్నారు. ఐఎం, సిమీ నేతలు అరెస్ట్‌ కావడంతో భారత్‌లో ఈ సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించడానికి నిందితుడు యత్నించాడన్నారు. నేపాల్‌లోని ఓ పాఠశాలలో ఆరిజ్‌ టీచర్‌గా చేసేవాడన్నారు. 2007లో యూపీ పేలుళ్లు, 2008లో జైపూర్, అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసుల్లో కూడా ఆరిజ్‌ నిందితుడిగా ఉన్నాడు. ఆరిజ్‌ ఆచూకీ తెలిపినవారికి ఎన్‌ఐఏ రూ.10లక్షలు, ఢిల్లీ పోలీసులు రూ.5 లక్షల రివార్డుల్ని గతంలోనే ప్రకటించారు.

మరిన్ని వార్తలు