ఇండిగో ఉద్యోగి అనుమానాస్పద మృతి

17 Nov, 2018 20:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గురుగ్రామ్‌ : ఇండిగో విమానయాన సంస్థలో అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ట్రెయినింగ్‌ నిమిత్తం గురుగ్రామ్‌ వచ్చిన మహిళ (35)  శుక్రవారం తన సొంతూరు గువహటి(అస్సాం)కి వెళ్లాల్సి ఉంది. ఈ ఘటన సుషాంత్‌ లోక్‌-1 గెస్ట్‌ హౌజ్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ట్రెయినింగ్‌ కోసం ఢిల్లీ వచ్చిన ఇండిగో ఉద్యోగి పనిముగించుకొని గురువారం సాయంత్రం ఓ గెస్ట్‌ హౌజ్‌లో దిగింది. సదరు మహిళ హోటల్‌ నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో ఆమె కొలీగ్‌ అనుమానం వచ్చి ఫోన్‌ చేశారు. రిప్లై లేకపోవడంతో హోటల్‌ సిబ్బందికి సమాచామిచ్చారు. 

హోటల్‌ సిబ్బంది ఎన్నిసార్లు డోర్‌ కొట్టినా ఎటువంటి స్పందన లేదు. దీంతో గది తలుపులు బద్దలు కొట్టిన హోటల్‌ సిబ్బందికి ఇండిగో ఉద్యోగి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అయితే, ఈ ఘటన విషయం పోలీసులకు చేరవేయడంలో హోటల్‌ యాజమాన్యం ఆలస్యం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఘటనా స్థలంలో ఎలాంటి  సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు చెప్పారు. మృతురాలి కుటుంబానికి సమాచారమిచ్చామని తెలిపారు. మహిళకు వివాహమైందనీ,  పోస్టుమార్టం పరీక్ష అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ కరణ్‌ గోయల్‌ చెప్పారు. ఘటనా హత్యా, ఆత్మహత్యా అనేది తేలాల్సి ఉందన్నారు. అయితే, ఘటనా స్థలంలో ఎలాంటి అనుమానిత ఆధారాలు దొరకలేదన్నారు.

‘గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇండిగో ఉద్యోగి ఫుడ్‌ ఆర్డర్‌ చేశారు. రూమ్‌లో ఆమెతో పాటు ఎవరూ లేరు. ఎప్పటిలాగానే మా హోటల్లో ఆ రోజు రాత్రి  వివిధ కంపెనీల్లో పనిచేసేవారు కూడా బస చేశారు. మహిళ మృతి గురించి తెలియగానే పోలీసులకు సమాచారమిచ్చాం’ అని గెస్ట్‌ హౌజ్‌ యజమాని తెలిపారు.

మరిన్ని వార్తలు