సాబ్‌... ఈ మానవ మృగాన్ని మాకు వదిలేయండి

22 Apr, 2018 12:24 IST|Sakshi
సీసీఫుటేజీలో నిందితుడు నవీన్‌ పసికందును తీసుకెళ్తున్న దృశ్యం.. నవీన్‌ను యువకులు చితకబాదుతున్న దృశ్యం

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌లో 6 నెలల పసికందుపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి మరీ ఆ మానవ మృగం కిరాతకానికి పాల్పడింది.  శుక్రవారం మధ్యాహ్నం ఓ సెల్లార్‌లో రక‍్తపు మడుగులో పడివున్న శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని నవీన్‌ గడాకే(‌21) గా గుర్తించి అరెస్ట్‌ చేశారు. నిందితుడు నవీన్‌ను శనివారం జిల్లా న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 

అప్పటికే కోర్టు వద్దకు చేరుకుని కొందరు ప్రజలు, సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఈ క్రమంలో పోలీసుల జీపు నుంచి దిగుతున్న నవీన్‌ను చూడగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు యువకులు అతన్ని పక్కకు లాక్కెల్లి పిడి గుద్దులు గుప్పించారు. సాబ్‌.. దయచేసి వీడిని మాకు వదిలేయండి.. వీడి అంతుచూస్తాం.. అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇంతలో పెద్ద ఎత్తున్న పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టి నవీన్‌ను పక్కకు తీసుకెళ్లారు. ఆపై నిందితుడిని పరుగు పరుగున న్యాయస్థానం లోపలికి తీసుకెళ్లారు. నిందితుడికి రిమాండ్‌ విధించిన కోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది. 

చిన్నారి తల్లిదండ్రులు రాజ్వాడాలో బెలూన్లు అమ్ముకుని జీవిస్తారనీ, నిందితుడు నవీన్‌.. ఆ కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసు అధికారి మిశ్రా వెల్లడించారు. దేశవ్యాప్తంగా మైనర్‌ బాలికలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.

చిన్నారులపై రేప్‌కు మరణశిక్ష!

ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం

మరిన్ని వార్తలు