న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి : హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త సానా సతీష్బాబును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్టుచేశారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సతీష్ నిందితుడిగా ఉన్నాడు. ఈడీ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆయన్ను అక్రమ నగదు చెలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అరెస్టుచేశారు. ఈ విషయమై ఈడీ ఉన్నతాధికారి ఒకరు మాట్లడుతూ.. విచారణకు సహకరించకపోవడంతోనే సతీష్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసులో సతీష్ సాక్షిగా ఉన్నప్పటికీ, ఖురేషీతో ఆయనకున్న ఆర్థిక సంబంధాల నేపథ్యంలో నిందితుడిగా కేసు నమోదు చేశామన్నారు.
ఖురేషీ మనీలాండరింగ్ కేసు నుంచి తనను తప్పించేందుకు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్తానాకు రూ.2 కోట్లు చెల్లించానని గతేడాది సతీష్ సీబీఐకి ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేగింది. సతీష్ ఫిర్యాదు ఆధారంగా ఆస్తానాపై నాటి సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మ కేసు నమోదు చేశారు. దీంతో తన ఆధ్వర్యంలో సిట్ విచారణ సాగకుండా అలోక్ అడ్డుకుంటున్నారని.. సానా సతీష్కు రక్షణ కల్పిస్తున్నారని ఆస్తానా ఆరోపించారు. అలోక్వర్మ అవినీతిపై కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. కాగా, ప్రభుత్వాధికారులతో చేతులు కలిపి మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ 2017లో ఖురేషీపై కేసు నమోదుచేసింది.
టీడీపీతో ‘సానా’ లింకులు
ఈ నేపథ్యంలో సానా సతీష్ అరెస్టుతో టీడీపీ కీలక నేతల్లో కంగారు మొదలైంది. మాజీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో బీజేపీలో చేరిన సీఎం రమేష్కు సానా సతీష్ అత్యంత సన్నిహితుడు. సీబీఐ కేసులో అరెస్టు, విచారణ లేకుండా చేసుకునేందుకు గత అక్టోబరులో సతీష్ చేయని ప్రయత్నంలేదు. అప్పట్లో తాను విచారణకు హాజరుకాకుండా సీబీఐ అధికారులతో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడినట్టు సతీష్ బాహాటంగానే ప్రకటించాడు. అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మతో సీఎం రమేష్ మాట్లాడిన తర్వాత విచారణ పేరుతో తనను పిలువలేదని సతీష్ విచారణలో వెల్లడించడం గమనార్హం.
పలువురు సీబీఐ,
ఈడీ అధికారులకు బినామీగా..
కాగా, ఏపీలోని టీడీపీ కీలక నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న సతీష్.. సీబీఐ, ఈడీల్లో పనిచేసే పలువురు అధికారులు, రాజకీయ నేతలకు బినామీగా ఉన్నాడనే ఆరోపణలున్నాయి. కేసుల నుంచి బయటపడేసేందుకు నేతల తరఫున ఆయన బేరసారాలు, ముడుపుల వ్యవహారాన్ని కూడా చూశారని పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సతీష్పై ఈడీ ఉచ్చు బిగిస్తే అతనితో సన్నిహితంగా మెలిగిన టీడీపీ నాయకులు కూడా ఈడీ వలలో పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సతీష్ అక్రమాస్తుల సోదా
ఇదిలా ఉంటే.. ఈస్ట్ గోదావరి బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఆర్ఏఎస్ మెరైన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, రస్మా ఎస్టేట్స్, ఎల్ఎల్పీ తదితర కంపెనీలకు సానా సతీష్ డైరెక్టర్గా ఉన్నాడు. విద్యుత్ శాఖలో గతంలో ఏఈగా పనిచేసిన సతీష్కు ఇన్ని కంపెనీల్లో పెట్టుబడు లు పెట్టేంత వేలాది కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దానిపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత ఆస్తులపై పలుమార్లు సోదాలు జరిపారు. కాగా, ఆయన్ను శుక్రవారం అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు సెంట్రల్ ఢిల్లీలోని తమ కార్యాలయంలో ఆ రాత్రంతా సుధీర్ఘంగా విచారించారు. ఈ సందర్భంగా సతీష్ అనేక విషయాలపై పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. మొయిన్ ఖురేషీకి చెందిన సంస్థలో షేర్ల కొనుగోలు వ్యవహారంలో కూడా సరిగ్గా స్పందించక పోవడంతో సతీష్ మనీల్యాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ నిర్ధారించింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి శనివారం అరెస్టుచేసింది. అనంతరం ఢిల్లీలోని పటియాలా కోర్టులో హాజరుపరిచారు.