చిన్నారిని వేడి సాంబార్ గరిటతో కొట్టిన సహాయకురాలు
బొమ్మనహళ్లి (చామరాజనగర): చిన్నారులకు పౌష్టికాహారం అందించి వారిలో మానసిక వికాసాన్ని పెంపొందించాల్సిన అంగన్వాడీ కేంద్రంలో అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. తన పరిధిలోని చిన్నారి మరో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిందనే కక్షతో ఆ కేంద్రం సహాయకురాలు క్రూరంగా వ్యవహరించింది. వేడి సాంబరులో ఉంచిన గరిటెతో మూడేళ్ల బాలుడిని విచక్షణా రహితంగా బాదింది. ఈ ఘటన చామరాజనగర తాలుకాలోని బసవపురంలో మంగళవారం చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన జడస్వామి అనే వ్యక్తి కుమారుడు హార్థిక్(3) సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేవాడు. అయితే కొంతకాలంగా సదరు బాలుడు అదే గ్రామంలోని మరో అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నాడనే కోపంతో సహాయకురాలు శివమల్లమ్మ ఆ బాలుడిని వేడి సాంబారులో ఉంచిన గంటె తీసుకొని బాదింది. దీంతో బాలుడి మెడ, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.