యశోద ఆసుపత్రికి రవళి

27 Feb, 2019 17:17 IST|Sakshi

హైదరాబాద్‌: వరంగల్‌  జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళిని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. రవళి గాయాలను పరిశీలించిన అనంతరం వైద్యులు చికిత్స ప్రారంభించారు. రవళికి మెరుగైన వైద్యం అందించాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, యశోద ఆసుపత్రి యాజమాన్యంతో అంతకుముందు మాట్లాడారు. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఎలాంటి ఆటంకం కలగకుండా వైద్యం కొనసాగించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఈరోజు(బుధవారం) సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి రవళి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకుని, యువతి కుటుంబసభ్యులతో మాట్లాడనున్నట్లు తెలిసింది. వరంగల్‌ జిల్లాలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో చదువుతున్న రవళి అనే విద్యార్థినిపై అదే కళాశాలలో చదువుతున్న సాయి అన్వేష్‌ అనే యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డ సాయి అన్వేష్‌ను తోటి విద్యార్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన రవళిని మొదట ఎంజీఎంకు ఆ తర్వాత యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు.

వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్‌ దాడి

మరిన్ని వార్తలు