నేను అందరికీ కోపం తెప్పిస్తున్నా..

17 Mar, 2018 07:22 IST|Sakshi
సాయిప్రియ (ఫైల్‌)

ఐ లవ్‌ మమ్మీడాడీ..

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు

నాగోలు: కుటుంబ సభ్యులు మందలించారని ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నాగోలు జైపురికాలనీకి చెందిన భూపాల్‌రెడ్డి కుమార్తె సాయిప్రియ (18) గాయత్రి కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసింది. పరీక్షలు ముగియడంతో ఖాళీగా ఉంటోంది.  తరచూ వాట్సాప్‌లో తన సోదరితో చాటింగ్‌ చేస్తుండటంతో ఆమె మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సాయిప్రియ గురువారం రాత్రి బెడ్‌రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఆమె సుప్రజ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇంటర్‌ పరీక్షలు సరిగా రాయలేకపోయాననే బాధతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి భూపాల్‌రెడ్డి ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని వద్ద లభించిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘నేను అందరికీ కోపం తెప్పిస్తున్నాను... నేను ఎందుకు ఉన్నాననే బాధ... నేను చచ్చిపోతే పనైపోతుంది కదా... డాడీ సారీ... ఐ లవ్‌ మమ్మీ,డాడీ... ఇన్ని రోజులు ఎందుకు ఆగానంటే అందరూ ఇంటర్‌ పరీక్షలు అనే అనుకుంటారు.... నేను పరీక్షలన్నీ మంచిగా రాశాను... అందుకే పరీక్షలు ముగిసాక చచ్చిపోవాల ని డిసైడయ్యా... మా అన్న, అక్కకి హ్యాపీ నేను చచ్చిపోతే...’’ అంటూ అందులో పేర్కొంది. 

మరిన్ని వార్తలు