కాపీయింగ్ చేస్తుండగా పట్టుకున్న ఇన్విజిలేటర్
అవమానంతో భవనం పైనుంచి దూకడంతో తీవ్రగాయాలు
విద్యారణ్యపురి: ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కిషన్పురంలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారం గ్రామానికి చెందిన కొలసాని వెంకటరావు కూతురు రక్షారావు హన్మకొండలోని ఎస్ఆర్ కళాశాలలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కళాశాలకు సంబంధించి పరీక్ష కేంద్రం హన్మకొండ కిషన్పురంలోని ఆర్డీ కళాశాలలో పడింది.
భవనం మూడో అంతస్తులో మొదటి పేపర్ సంస్కృతం పరీక్ష రాయడానికి వచ్చిన రక్షారావు.. కాపీయింగ్ చేస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకుని చీఫ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకు కాపీ చేస్తున్నావంటూ వారు ప్రశ్నిస్తుండగానే ఆందోళనకు గురైన రక్షారావు ఒక్కసారిగా భవనం నుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల నిర్వాహకులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.