ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

2 Feb, 2019 13:15 IST|Sakshi

అంకిరెడ్డిపాలెంలోని ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థి

మృతుడి స్వగ్రామం ప్రకాశం జిల్లా లక్కవరం

అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు

గుంటూరు రూరల్‌: ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు రూరల్‌ మండలంలోని అంకిరెడ్డిపాలెంలో గల ఓ ప్రైవేటు కళాశాలలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి చిన్న నరసింహారెడ్డి కుమారుడు మల్లికార్జునరెడ్డి (18) అంకిరెడ్డిపాలెంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో కళాశాలలోని హాస్టల్‌ గదిలో మల్లికార్జునరెడ్డి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, తోటి విద్యార్థులు గమనించి కేకలు వేశారు. కళాశాల అధ్యాపకులు, యాజమాన్యం వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నల్లపాడు పోలీసులు సంఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు