రైలుఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి

20 Jan, 2020 12:46 IST|Sakshi
రైలుఢీకొని మృతిచెందిన భూపతి నాయుడు (ఫైల్‌ఫొటో)

విజయనగరం,బాడంగి: మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి వాలేటి జోగీందర్‌ భూపతినాయుడు (18)ఉరఫ్‌ ఉదయ్‌ను రైలు ఢీ కొనడంతో ఆదివారం మృతిచెందాడు. విద్యార్థి విజయవాడ చైతన్య కళాశాలలో ద్వితీయ ఇంటర్‌ చదుతున్నాడు. సంక్రాంతి సెలవులకోసం స్వ గ్రామం భీమవరం వచ్చాడు. తల్లిదండ్రులు, అక్క, స్నేహితులతో ఆనందంగా గడిపాడు. తిరిగి కళాశాలకు వెళ్లేందుకు డొంకినవలస గ్రామం పక్క నుంచి ట్రాక్‌ దాటుతూ రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా ఉదయం 9.30 ప్రాంతంలో విశాఖ నుంచి కొరాపుట్‌ వెళ్లే (డీఎంయూ) ఢీకొంది. దీంతో విద్యార్థి దుర్మరణం చెందాడు. రైలు డ్రైవర్, స్టేషన్‌ మాస్టారు ఇచ్చిన సమాచారం మేరకు బొబ్బిలి హెచ్‌సీ కృష్ణారావు తమ సిబ్బందితో కలసి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆదుకుంటాడనుకున్న కుమారుడుని రైలు రూపంలో మృత్యువు కబలించిందంటూ తల్లిదండ్రులు ఉమాదేవి, తిరుపతినాయుడు, సోదరి తేజశ్వని బోరున విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు