ఆదాయానికి గండి...

22 May, 2019 10:18 IST|Sakshi

భద్రతకు ముప్పు గుట్టుగా సాగుతున్న కాల్‌ రూటింగ్‌ దందా

ప్రధాన సూత్రధారులంతా విదేశాల్లోనే

సిటీలో తరచూ పట్టుబడుతున్న పాత్రధారులు

ఫలక్‌నుమాలో అరెస్టుతో మరోసారి తెరపైకి

సాక్షి, సిటీబ్యూరో: హైటెక్‌ పద్దతిలో ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ (వీఓఐపీ) పద్దతిలో లోకల్‌ కాల్స్‌గా మార్చే కాల్‌ రూటింగ్‌ ముఠాను ఫలక్‌నుమా పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వీరి నిర్వాకంతో తమకు రూ.1.44 కోట్ల నష్టం వాటిల్లిందని టెలికాం శాఖ ఫిర్యాదు చేసింది. అయితే నగరంలో తరచూ వెలుగులోకి వస్తున్న ఈ తరహా దందాలతో కేవలం ప్రభుత్వానికి ఆర్థిక నష్టమే కాకుండా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, నిఘా వర్గాలు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు 

ఇంటర్నేషనల్‌ కాల్‌ వచ్చేది ఇలా...
విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్‌ కాల్‌ అక్కడి ఎక్స్‌ఛేంజ్‌ నుంచి నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడి నుంచి ఇంటర్నేషనల్‌ గేట్‌ వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడి నుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లేదా శాటిలైట్‌ ద్వారా మన దేశానికి వస్తాయి. ఈ ఫోన్‌కాల్‌ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్‌ రిసీవ్‌ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్‌ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.  

ఆ మొత్తం ఎగ్గొట్టడానికే...
ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకునేందుకు అక్కడి కాల్‌ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే సూత్రధారులంతా విదేశాల్లోనే ఉంటారు. కొందరు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్‌ రూటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్‌ విదేశాలకు వెళ్లాలంటే (ఔట్‌ గోయింగ్‌) కచ్చితంగా అది సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్‌ కాల్‌ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్‌ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్ల వద్ద ఉంటాయి. వారికి చిక్కకుండా హైటెక్‌ పద్దతిలో ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ పద్దతిలో లోకల్‌ కాల్స్‌గా మారుస్తుంటారు. 

రూటింగ్‌ ఇలా...
విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించేలా ఓ విధానాన్ని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొందరికి ఇంటర్‌నెట్‌ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. అలా ఏర్పాటైన తరువాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌ అక్కడ డేటాగా మారిపోతుంది. దాన్ని ఇంటర్‌నెట్‌ ద్వారా నేరుగా ఇక్కడి వారితో ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి వద్ద ఉండే గేట్‌వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్‌ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్‌) బోగస్‌ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులను సేకరించి లేదా ఇతరుల పేర్లతో తీసుకున్న వాటిని వినియోగించి ఈ సీడీఎమ్‌ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్‌ లోకల్‌గా మారిపోయి ఈ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్‌) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్‌ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్‌ఛార్జ్‌ తగ్గుతుంది. దేశంలోని పలువురు ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు దెబ్బతింటున్నాయి. ఇలా దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్‌ ఆ మొత్తాన్నీ మిగుల్చుకుంటున్నాడు. ఇక్కడ అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులు హవాలా రూపంలో కమీషన్‌ అందజేస్తారు. 

ఈ కారణంగానే ప్రాధాన్యం...
ప్రధానంగా పాకిస్థాన్‌... మరికొన్ని దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారులను ట్రాప్‌ చేయడానికి చూస్తుంటాయి. దీనికోసం వారు ‘హనీ ట్రాప్‌’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుంటారు.కొన్ని సందర్భాల్లో నిజంగానే యువతుల్ని రంగంలోకి దింపుతారు. కొంత పరిచయం పెరిగిన తర్వాత ఇక్కడి అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపిస్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్‌ చేయడానికి కాల్‌ రూటింగ్‌ విధానాన్నే వినియోగిస్తారు. ఫోన్‌ వచ్చిన నంబర్‌కు కాల్‌ బ్యాక్‌ చేసే అవకాశం లేని నేపథ్యంలో రూటింగ్‌ ద్వారానే దీనికి పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు