నడిపేది ఆటో ఉండేది విల్లా

3 May, 2019 10:18 IST|Sakshi

విదేశీ మహిళ డబ్బుతో కొనుగోలు  

గుర్తించిన ఐటీ అధికారులు

ఆటోడ్రైవర్‌ సుబ్రమణి కేసులో ఆసక్తికర విషయాలు వెల్లడి

అతనో ఆటోడ్రైవర్‌. ఉండేది మాత్రం విలాసవంతమైన భవనంలో. ఇదెలా సాధ్యం అని ఐటీ అధికారులు నివ్వెరపోయారు. సోదాల్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ఒక విదేశీ మహిళకు బినామీగా పెద్దఎత్తున ఆస్తులుకూడబెట్టినట్లు తేలింది.  

బనశంకరి: బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఆటోడ్రైవరు సుబ్రమణి నివాసముంటున్న విలాసవంత విల్లాపై ఐటీ అధికారుల దాడిలో లోగుట్లు బయటపడుతున్నాయి. ఒక విదేశీమహిళ డబ్బుతో ఆటోడ్రైవరు బంగ్లా కొనుగోలు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ఆటోడ్రైవరు సుబ్రమణి ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులు పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా సుబ్రమణి ఒక విదేశీ మహిళకు బినామీ అని తెలిసింది. ఒక విదేశీ మహిళ సుబ్రమణి పేరుతో ఆస్తులు కొని అతన్ని బినామీగా ఉంచారని ఐటీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో సుబ్రమణి విల్లా కొనుగోలు గురించి ఐటీ అధికారులు ఐటీ చట్టం 21 (1) సెక్షన్‌ ప్రకార సమాచారం అడిగారు. దీంతో ఐటీ అధికారులకు తన వద్ద ఉన్న పత్రాలను అందజేశాడు.  

బ్యాంకు ద్వారా నగదు బదిలీ  
విదేశీ మహిళ తనకు అనుకోకుండా పరిచయమైందని, ఆమె భారతదేశంలో ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పిందని తెలిపాడు. తనకు ఎంతోమంది రాజకీయనేతలు పరిచయస్తులని, ఉన్నవి లేనివి కల్పించి మహిళను నమ్మించి ఆస్తులు కొనుగోలు చేయించి ఉంటాడని ఐటీ అధికారులు భావిస్తున్నారు. సుబ్రమణి మాటలు నమ్మిన విదేశీ మహిళ అతడి పేరుతో ఆస్తి కొనుగోలు చేయడానికి విదేశాల నుంచి బ్యాంక్‌ ద్వారా నగదు బదిలీ చేసినట్లు విచారణలో తేలింది. దీంతో సుబ్రమణి బంగ్లా కొనుగోలు చేశాడని వెల్లడైంది.

కీలక పత్రాలు స్వాధీనం  
సుబ్రమణి ఉంటున్న విలాసవంతమైన విల్లాపై దాడిచేసిన ఐటీ అధికారులు కీలక ఫైళ్లను స్వాధీనం చేసు కుని పరిశీలించారు. ఈ సమయంలో కోట్లాది రూపాయల వి లువ చేసే ఆస్తిపత్రాలు లభించాయి.  ప్రస్తు తం ఆస్తుల వివరాలు మొత్తం రూ.1 కోటి 60 లక్షలు అని అంచనా. ఐటీ అధికారులు సోదాల అనంతరం సుబ్రమణికి విచారణకు రావాలని నోటీస్‌లు జారీ చేశారు. 

>
మరిన్ని వార్తలు