కానిస్టేబుల్‌ ఒంటి నిండా తూటాలే...!

6 Jul, 2018 08:32 IST|Sakshi
కానిస్టేబుల్‌ జావెద్‌

మరో దారుణ ఘటన. రెచ్చిపోయిన ఉగ్రవాదులు ఓ కానిస్టేబుల్‌ను బలి తీసుకున్నారు. అపహరించి మరీ ఒంటి నిండా తూటాలు దింపారు. సోషల్‌ మీడియాలో ఫోటోలు సర్క్యూలేట్‌ కావటంతో కశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

సాక్షి, న్యూఢిల్లీ/శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉగ్ర పంజా దాటికి ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయాడు. గురువారం సోఫియాన్‌ జిల్లా కచ్‌దూరా ప్రాంతంలో జావెద్‌ అహ్మద్‌ దార్‌ అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ను టెర్రరిస్టులు అపహరించారు. ఇంటి సమీపంలోని ఓ మెడికల్‌ షాపు వద్ద ఉన్న అతన్ని తుపాకులు చూపించి శాంట్రో కారులో ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న బలగాలు పెద్ద ఎత్తున్న గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే శుక్రవారం ఉదయం  కుల్గాంలోని పరివాన్‌ వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఒంటి నిండా బుల్లెట్లే... కాగా, అతని శరీరం బుల్లెట్లతో ఛిద్రమైనట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని సోఫియాన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు హాజ్‌ యాత్రలో ఉండగా, వారికి అధికారులు సమాచారం అందించారు. ఈ ఏప్రిల్‌లో కచ్‌దూరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కశ్మీర్‌ పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆ బృందంలో జావెద్‌ కూడా ఉన్నాడు. చంపే ముందు అతన్ని హింసించిన కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే మిలిటెంట్లు గత కొంత కాలంగా ప్రతీకార దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గత నెలలో ఔరంగజేబ్‌ అనే రైఫిల్‌మన్‌ను ఇదే రీతిలో క్రూరంగా ప్రాణాలు తీశారు.

మరిన్ని వార్తలు