సహ ఉద్యోగిని హత్య చేసిన జవాన్లు

31 Mar, 2018 06:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి(కర్ణాటక) : సహ ఉద్యోగిని హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు ఇద్దరు జవాన్లను శుక్రవారం వివేకనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీసీపీ చంద్రగుప్త తెలిపిన మేరకు వివరాలు...బెంగళూరులోని వివేకనగర ఏఎస్‌సీ క్యాంపస్‌ సెంటర్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పంకజ్‌కుమార్‌(26), ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన ధనరాజ్, మురళీకృష్ణ జవాన్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల మురళీకృష్ణకు చెందిన కొన్నిపత్రాలు గల్లంతయ్యాయి. ఈ విషయంలో మురళీకృష్ణ, పంకజ్‌కుమార్‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో  పంకజ్‌కుమార్‌ను హత్య చేయాలని మురళీకృష్ణ పథకం పన్నాడు.

ఈనెల 23న రాత్రి 11 గంటల సమయంలో  పంకజ్‌కుమార్‌ గదిలోకి చొరబడిన మురళీకృష్ణ, అతని సహద్యోగి ధనరాజ్‌లు దాడికి పాల్పడ్డారు. కాళ్లు చేతులు, ఇతర భాగాలపై కత్తులతో పొడిచి పంకజ్‌కుమార్‌ను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని క్యాంపస్‌కు రాత్రి సమయంలో నీరు తీసుకువచ్చే ట్యాంకర్‌లో వేసుకుని దుమ్మలూరు గాల్ప్‌కోర్సు వద్దకు తీసుకెళ్లి కాల్చారు. మృతదేహం పూర్తిగా దగ్ధం కాకపోవడంతో మళ్లీ నీటి ట్యాంకర్‌లో క్యాంపస్‌ ఆవరణలోకి తెచ్చి చెత్తకుప్పలో పడేశారు. తరువాత గదిలోకి వెళ్లి రక్తపుమరకలను శుభ్రం చేశారు. మృతదేహం దగ్ధం చేసే సమయంలో ధనరాజ్‌కు గాయాలయ్యాయి. దీంతో 24న ధనరాజ్‌ క్యాంపస్‌లో ఉన్న ఆసుపత్రిలో చేరాడు.  ట్రినిటీ సర్కిల్‌ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడినట్లు తెలిపాడు. అతని మాటలు నమ్మదగినవిగా లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

అదే సమయంలో   క్యాంపస్‌ మూలలో సగభాగం కాలిన మృతదేహాం కనబడింది.మరో వైపు జవాన్‌ పంకజ్‌కుమార్‌ అదృశ్యమైనట్లు  విచారణలో వెలుగుచూసింది. దీనిపై క్యాంపస్‌ అధికారులు  వివేకనగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్యాంపస్‌కు చేరుకున్న పోలీసులు అక్కడ పడిఉన్న మృతదేహాన్ని పరిశీలించారు.  మృతదేహాం పంకజ్‌కుమార్‌దిగా గుర్తిం చారు. స్పష్టత కోసం పంకజ్‌కుమార్‌ తల్లిదండ్రులను రప్పించారు. మృతు డు తమవాడేనని తల్లిదండ్రులు నిర్ధారించారు. దీంతో డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. జాగీలం ధనరాజ్‌ గదివద్దకు వెళ్లి ఆగిపోయింది. ధనరాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా  మురళీకృష్ణ తో కలిసి పంకజ్‌కుమార్‌ను హత్యచేసిన ట్లు అంగీకరించాడు. దీంతో ధనరాజ్‌ ను, మురళీకృష్ణను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టినట్లు డీసీపీ  తెలిపారు.

మరిన్ని వార్తలు