రెచ్చిపోయిన జేసీ వర్గీయులు.. వైసీపీ నేతపై దాడి

28 Feb, 2018 08:42 IST|Sakshi

సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. తాడిపత్రిలో జేసీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు గయాజ్‌ బాషా ఆలియాస్‌ మున్నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జేసీ వర్గీయుల నుంచి మున్నా తృటిలో తప్పించుకున్నారు. 

తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తిని పరామర్శించి వస్తున్న సమయంలో జేసీ వర్గీయులు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వారి నుంచి మున్నా ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి సంబంధించిన రెండు వాహానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

వైఎస్‌ఆర్‌సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మున్నాను హతమార్చేందుకు జేసీ వర్గీయులు కుట్రపన్నారని తెలుస్తోంది. అంతేకాక వక్ఫ్‌ ఆస్తుల అన్యాక్రాంతం, నిధుల గోల్‌మాల్‌ వెనుక టీడీపీ నేతల పాత్రపై మున్నా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడికి ప్లాన్‌ చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరాచకాలపై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

జేసీ ప్రభాకర్ దౌర్జన్యాలు పెరిగిపోయ్యాయి..
వైఎస్‌ఆర్‌సీపీ నేత మున్నాపై జరిగిన హత్యాయత్నాన్ని తాడిపత్రి టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, ఫయాజ్‌ భాషా, జగదీశ్వర్‌ రెడ్డి ఖండించారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని వారు పేర్కొన్నారు. పబ్లిక్‌గా దాడులు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. జేసీ అరాచకాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నేతలు అన్నారు.

>
మరిన్ని వార్తలు