లైంగిక దాడి చేసి నిప్పంటించిన కిరాతకుడు

18 May, 2018 18:06 IST|Sakshi

రాంచి: జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడి, నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు శుక్రవారం మరణించింది. ఈ ఘటన పాకూర్‌ జిల్లాలోని కాకర్‌వానా గ్రామంలో మే 4న జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాకర్‌వానా గ్రామంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై బచ్చన్‌ మండల్‌ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలోని మరుగుదొడ్ల వద్దకు తీసుకెళ్లి ఆమెకు నిప్పంటించి పరారయ్యాడు.

తీవ్ర గాయాలతో ఉన్న బాలికను తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  అయితే, మొదట బాధితురాలి తల్లిదండ్రులు ఆమె ఆత్మహత్యకు పాల్పడొచ్చని భావించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగు పడక పోవడంతో ఆమెను బొకారో జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన ఘోరాన్ని పోలీసులకు తెలిపింది. నిందితునిపై పోక్సో చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పాకూర్‌ డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు.

కాగా, నిందితునిపై చర్యలు తీసుకోవడంలో మెతక వైఖరి ప్రదర్శించిన ముసఫిర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ను సస్పెండ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇటీవల జార్ఖండ్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్యా ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. చాత్రా జిల్లాలో జరిగిన మైనర్‌ బాలికపై హత్యాచార ఘటనలో ప్రమేయమున్న 15 మందిని  పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు