బాలికపై అత్యాచారం : ముగ్గురికి మరణశిక్ష

3 Mar, 2020 19:52 IST|Sakshi

రాంచీ : ఆరేళ్ల బాలికపై అత్యంత కిరాతంగా అత్యాచారం జరిపి ఆపై పెట్రోల్‌తో కాల్చి హత్య చేసిన కేసులో జార్ఖండ్‌ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ మేరకు ఈ రాష్ట్రంలోని దుమ్‌కా జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి తుఫిక్‌ ఉల్‌ హుస్సేన్‌ మంగళవారం తీర్పును వెలువరించారు. కేసులో దోషులగా తేలిన ముగ్గురికి తలా రూ.50 వేల జరిమానా కూడా విధించారు. కాగా శిక్షపడిని ముగ్గురు దోషులూ 19 నుంచి 25 ఏళ్ల మధ్యవారు కావడం గమనార్హం. ఘటన జరిగిన 25 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి శిక్షను ఖరారు చేయడం విశేషం.

మితూరాయ్‌, పంకజ్‌ మొహలీ, అశోక్‌ రాయ్‌ అనే ముగ్గురు యువకులు ఈ ఏడాది ఫిబ్రవరి 8న అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిపారు. అనంతరం హత్య నుంచి తప్పించుకోవాలని బాలికపై పెట్రోల్‌పోసి దారుణంగా కాల్చి హత్య చేశారు. కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు ఫోక్స్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. కాగా దోషుల్లో ఒకరైన పంకజ్‌ బాధితురాలికి సమీప బంధువు కావడం  విచారం.


 

మరిన్ని వార్తలు