బెయిలుపై బయటికి.. మళ్లీ అదే క్రూరత్వం!

13 Jul, 2019 11:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాంచి : హత్య కేసులో బెయిలుపై బయటికి వచ్చిన ఓ నిందితుడు పాశవిక చర్యకు పాల్పడ్డాడు. తన షాపునకు వచ్చిన ఇద్దరు పిల్లల తలలను నరికి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని లాతేహర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... సెమార్హట్‌ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఓ బాలిక(10) చాక్లెట్లు కొనుక్కొనేందుకు అతడి షాపులోకి వచ్చింది. ఆమెను ఇష్టం వచ్చినట్లుగా గట్టిగా తిడుతుండటంతో అక్కడే కాస్త దూరంగా ఆడుకుంటున్న బాలుడు(11) వాళ్ల దగ్గరికి వెళ్లాడు.

ఈ క్రమంలో చుట్టుపక్కల ఎవరూ లేనిది చూసిన బాలుడు, బాలిక ఇద్దరినీ ఇంట్లోకి లాక్కెల్లిన నిందితుడు గొడ్డలితో వాళ్ల తలలు నరికాడు. అనంతరం వాళ్ల శవాలు కాల్చి ఇంటి పక్కన ఉన్న మట్టి దిబ్బలో పూడ్చిపెట్టాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. కాగా గతంలో రెండు హత్యలు చేశాడని.. తాంత్రిక విద్యలు నేర్చుకునేందుకే నిందితుడు ప్రస్తుతం మరోసారి నరబలి ఇచ్చాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు