తల్లీకూతుళ్లను హతమార్చి.. ఆత్మహత్య

16 Aug, 2019 20:06 IST|Sakshi
ఉన్మాదిగా మారిన బంటీ రాజస్‌(కర్టెసీ: ఇండియా టుడే)

భోపాల్‌ : ప్రేమోన్మాదిగా మారిన ఓ యువకుడు ఇద్దరి ప్రాణాలు తీశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... బంటీ రాజస్‌ (25) ప్రేమ పేరిట ఓ బాలికను వేధించేవాడు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో తరచుగా ఆమెను కలిసేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు అతడిపై మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇకపై బాలికను ఇబ్బంది పెట్టనని బంటీ పోలీసులతో చెప్పడంతో అతడిని విడిచిపెట్టారు.

ఈ నేపథ్యంలో బాలికపై పగ పెంచుకున్న బంటీ సరైన సమయం కోసం వేచి చూశాడు. బాలిక తండ్రి, సోదరుడు పొరుగు ఊరు వెళ్లిన విషయం తెలుసుకుని గురువారం రాత్రి వారి ఇంట్లో ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో బాలికను పలుమార్లు పొడిచాడు. ఈ క్రమంలో అడ్డుపడిన బాలిక తల్లిపై కూడా పాశవికంగా దాడి చేశాడు. దీంతో వారిద్దరు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడి నుంచి పారిపోయిన బంటీ.. సమీపంలో ఉన్న సరస్సులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న తల్లీకూతుళ్లను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు