నల్లగొండలో గోదా'వర్రీ'

16 Sep, 2019 10:13 IST|Sakshi
చికిత్స పొందుతున్న కిరణ్‌కుమార్‌(వనిపాకల), గల్లా శివశంకర్‌(గుడిమల్కాపురం ), హాలియాకు చెందిన సురభి రవీందర్‌ (మార్క్‌ చేసిన వ్యక్తి ) (ఫైల్‌)

దేవీపట్నం వద్ద లాంచీ ప్రమాదంలో ఉమ్మడి జిల్లా వాసులు

ఇద్దరు గల్లంతు.. మరో ఇద్దరు సురక్షితం

ఆందోళనలో బాధిత కుటుంబ సభ్యులు 

సాక్షి, హాలియా: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నదిలో ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో నల్లగొండకు చెందిన తరుణ్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇతని వివరాలు తెలియరాలేదు. అలాగే హాలియాకు చెందిన సురభి రవీందర్‌ ఉన్నాడు. చిట్యాల మండలం వనిపాకలకు చెందిన కిరణ్‌కుమార్, చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన శివశంకర్‌ సురక్షితంగా బయటపడ్డారు. వీరిద్దరు రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా వీరంతా హైదరాబాద్‌లో పోలీస్‌శాఖలోని హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నేహితులతో కలసి పాపికొండలు వెళ్లారు. కాగా లాంచీ నీట మునగడంతో వీరి విహారయాత్ర విషాదాంతమైంది. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యాటక శాఖకు చెందిన లాంచీ మునిగిన ప్రమాదంలో ఉమ్మడి జిల్లా వాసులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ఉమ్మడి జిల్లా వాసులు ఉండగా ఇద్దరు గల్లంతు కాగా మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ఆదివారం జరిగిన లాంచి ప్రమాదంలో హాలియా పట్టణానికి చెందిన సురభి రవీందర్‌(22) గల్లంతైనట్లు తెలుస్తోంది. పట్టణానికి చెందిన సురభి వెంకటేశ్వర్లు, లక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడు సురభి రవీందర్‌ గత కొంత కాలంగా హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సైట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వరుసగా శని, ఆదివారాలు సెలవులు కావడంతో హైదరాబాద్‌కు చెందిన తన స్నేహితులు రాజేష్, తరుణ్‌తో పాటు వరంగల్‌కు చెందిన సురేష్, రాజేందర్‌తో కలిసి టూరిస్టు బస్సులో భద్రాచలానికి బయలు దేరారు. అక్కడ దైవ దర్శనం చేసుకున్న అనంతరం గోదావరిలో లాంచీలో విహారయాత్ర చేసేం దుకు బస్సులో రాజమండ్రికి వెళ్లారు.

అక్కడే సురభి రవీందర్‌ తన స్నేహితులతో కలిసి రాజమండ్రిలో లాంచీ ఎక్కారు. తన స్నేహితులతో కలిసి రాజమండ్రి నుంచి భద్రాచలం వస్తుండగా మార్గ మధ్యలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో   ప్రమాదశాత్తు నదిలో మునిగిపోయింది. దాంతో రవీందర్‌తో పాటు తన వెంట వచ్చిన హైదరాబాద్, వరంగల్‌కు చెందిన ఆయన స్నేహితులు  గల్లంతైనట్లు సమాచారం. విషయం తెలిసిన రవీందర్‌ తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటనా స్థలా నికి బయలు దేరారు.  అలాగే ఈ ప్రమాదంలో నల్లగొండకు చెందిన తరుణ్‌రెడ్డి కూడా గల్లం తైనట్లు సమాచారం. 

బయటపడిన గల్లా శివశంకర్‌
చింతలపాలెం: దేవీపట్నం వద్ద పర్యాటక  లాంచీ నీట మునిగిన ప్రమాదం నుంచి ప్రాణా లతో బయటపడిన గల్లా శివశంకర్‌ చింతల పాలెం మండలం గుడి మల్కాపురం వాసి.  శివశంకర్‌ గల్లా పెదలక్ష్మయ్య, ధనలక్ష్మి కుమారుడు. ఈ యన పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఏఈగా పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు అదే డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న మరో ఏడుగురు స్నేహితులు కూడా అక్కడకు వెళ్లినట్లు సమాచారం.  

చిట్యాలవాసి సురక్షితం
చిట్యాల: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన పర్యాటక శాఖకు చెందిన లాంచీ మునిగిన ప్రమాదం నుంచి నల్లగొండ జిల్లా చిట్యాల మండలవాసి సురక్షితంగా బయటపడ్డాడు.  చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన మేడి కిరణ్‌ కుమార్‌ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నివా సం ఉంటూ సరూర్‌నగర్‌లోని పోలీస్‌శాఖ హౌ సింగ్‌ ప్లానింగ్‌ విభాగంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన స్నేహితులతో కలిసి పాపికొండల విహారయాత్రకు వెళ్లాడు. కాగా అక్కడ పడవ మునక ప్రమాదం నుంచి ఆయన ప్రా ణాలతో బయటపడి రంపచోడవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ప్రస్తు తం క్షేమంగానే ఉన్నాడు. దాంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. 

చదవండి: నిండు గోదారిలో మృత్యు ఘోష

>
మరిన్ని వార్తలు