బుఖారి హత్య : అనుమానితుల ఫొటోలు విడుదల

15 Jun, 2018 09:11 IST|Sakshi
సీసీటీవీ పుటేజీ ఆధారంగా కశ్మీర్‌ పోలీసులు విడుదల చేసిన అనుమానితుల ఫొటోలు

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌, రైజింగ్‌ కశ్మీర్‌ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్‌ సయ్యద్‌ షుజాత్‌ బుఖారి ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు అనుమానితుల ఫొటోలను గురువారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా మాస్కులు ధరించి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల కదలికలను గుర్తించామని పోలీసులు తెలిపారు. అనుమానితుల ఫొటోలను విడుదల చేయడం ద్వారా స్థానికుల సాయంతో వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నేరస్తులకు సంబంధించిన సమాచారం అందించిన పౌరుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలియజేశారు.

కాగా గురువారం సాయంత్రం ఇఫ్తార్‌ విందుకు వెళ్లేందుకు బుఖారి శ్రీనగర్‌లోని తన ఆఫీస్‌ నుంచి బయటకు రాగానే దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుఖారితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు చనిపోయారు. అయితే ఉగ్రవాదులే బుఖారిని హత్య చేశారని భావిస్తుండగా.. ఈ హత్యను తామే చేసినట్లు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు