పట్టుచీరల కేసు మాఫీకి యత్నం!

20 Apr, 2019 12:29 IST|Sakshi

పోలీసులపై టీడీపీనేతల ఒత్తిడి

పట్టుచీరల స్థానంలో సిల్క్‌చీరలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజంపేట : పట్టణంలో బోయపాళె–2లో ఈనెల 10న రాత్రి టీడీపీ నాయకుల కనుసన్నలో ఓటర్లకు పట్టుచీరలు పంపిణీ చేసిన కేసు మాఫీకి ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ కేసు పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోకి రావడం, ఆ కేసు నమోదు కాకుండా చేసేందుకు  టీడీపీ నేతల ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది.  కేసు నీరుగార్చేందుకు ఇద్దరు పోలీసులు అధికారులు ప్రమేయం ఉన్నట్లుగా విమర్శలు ఉన్నాయి. వివరాల్లోకి వెళి తే..టీడీపీ కి చెందిన జన్మభూమి కమిటీ సభ్యుడుగా ఉన్న సుబ్రమణ్యం  ఓటర్లకు పంపిణీ చేసేందుకు మరో టీడీపీ నాయకుని సంబం ధించి అద్దె ఇంటిలో ఉన్న చీరల మూటను తీసుకొచ్చారు.

ఓటర్లకు పట్టుచీరలు పంపిణీ చేసే సందర్భంగా సమాచారం తెలుసుకున్న ఎన్నికల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు,పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. చీరలు పంపిణీ చేసిన నాయకున్ని అదుపులోకి తీసుకున్నారు. చీరలను  స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఎన్నికల పోలింగ్‌ తర్వాత అంటే 13వతేదీ ఈ కేసు విషయం పరిశీలి స్తామని పోలీసుల చెప్పి, పట్టుబడిన వ్యక్తిని వదలివేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఆతర్వాత ఆ కేసు గురించి అతీగతి లేదనే అపవాదును పట్టణ పోలీసులు మూటకట్టుకున్నారు. అయితే పట్టుకున్నప్పుడు పట్టుచీరలు ఉంటే, వాటిని స్థానంలో స్కిల్‌ చీరలు పెట్టినట్లుగా తెలిసింది. ఇప్పుడు ఈ కేసు మాఫీ విషయంపై పట్టణంలో వైరల్‌గా మారుతోంది. ఎన్నికలపోలింగ్‌ ముందురోజు రాత్రి   పట్టుకున్న పట్టుచీరల కేసు నమోదుచేశారా? లేక టీడీపీ నేతల ఒత్తిడితో పక్కనపెట్టేశారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు