ముఖంలో బుల్లెట్‌ దింపారు

23 Oct, 2019 12:26 IST|Sakshi

సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల హిందూ సమాజ్‌ పార్టీ నాయకుడు కమలేష్‌ తివారీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలేష్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆ రిపోర్టును బుధవారం బయటపెట్టారు. రిపోర్టులోని వివరాలు.. దుండగులు కమలేష్‌ను దవడ నుంచి ఛాతీ వరకు 15 సార్లు కత్తితో దారుణంగా పొడిచారు. రెండు సార్లు గొంతు కోయడానికి ప్రయత్నించారు. కమలేష్‌ కుప్పకూలిపోయాక చనిపోయాడో లేదోనన్న అనుమానంతో తుపాకీతో ముఖంపై కాల్చారు. ఈ మేరకు కమలేష్‌ తలలో పాయింట్‌ 32 బుల్లెట్‌ను డాక్టర్లు కనుగొన్నారు.

మరోవైపు నిందితుల కోసం గాలించిన పోలీసులు గుజరాత్‌ - రాజస్థాన్‌ సరిహద్దుల్లో ఇద్దరిని పట్టుకున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్న గుజరాత్‌ యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ బృందం వారిని సూరత్‌కు చెందిన అష్ఫాక్‌ షేక్‌ (34), మొయినుద్దీన్‌ పఠాన్‌(27) గా గుర్తించింది. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు అప్పగించింది. మరో నిందితుడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. 

మరిన్ని వార్తలు