ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్త హత్యకు భార్య ప్లాన్

23 Dec, 2019 16:31 IST|Sakshi

వివాహేతర సంబంధమే కారణమని భర్త ఫిర్యాదు

అనుమానంతో ఒకరిని చితకబాధిన భర్త

ఇరువర్గాలపై కేసులు నమోదు

కమాన్‌చౌరస్తా(కరీంనగర్‌): ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హత్య చేసేందుకు భార్య యత్నించగా తప్పించుకున్నానని కరీంనగర్‌కు చెందిన వంశీకృష్ణ కరీంనగర్‌ టూ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే తన ఇంట్లోకి వచ్చి తీవ్రంగా కొట్టి, చంపుతామని బెదిరించారని గంగారపు సమన్విత్‌ అలియాస్‌ సన్నీ.. వంశీకృష్ణతోపాటు మరో ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 14 తేదీన వంశీకృష్ణ ఇంట్లో ఉండగా సన్నీ, గణేశ్‌ అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దిండుతో అదిమిపెట్టి శ్వాస ఆడకుండా చేసి హత్యచేయాలని చూడగా బాధితుడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.

కాగా, ఈనెల 17న తన ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి చంపుతామని బెదిరించి తన భార్యకు ఫోన్‌ చేయవద్దంటూ చితకబాదారని వంశీకృష్ణ, శివ, శ్రీధర్‌లతోపాటు మరోముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై సన్నీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా వంశీకృష్ణ భార్యతో సమన్విత్‌ సన్నిహితంగా ఉన్న ఫొటోలు రెండు మూడు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వివాహేతర సంబందం గురించి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం వంశీకృష్ణ భార్య ఆమె తల్లిదండ్రుల వద్దకు చేరగా,  ఇద్దరు పిల్లలు మాత్రం వంశీకృష్ణ వద్దనే ఉన్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు