కాంగ్రెస్‌ నాయకురాలి అనుమానాస్పద మృతి..!

17 May, 2019 18:13 IST|Sakshi

బెంగుళూరు : కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రేష్మా పడెకనూర్‌ మృతి చెందారు. గురువారం రాత్రి అదృశ్యమైన ఆమె శుక్రవారం శవమై కనిపించారు. బసవనబాగేవాడి తాలుకాలో కృష్ణానదిపై నిర్మించిన కొల్హార్‌ బ్రిడ్జి సమీపంలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్నపోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై గాయాలున్నాయని.. ఇది హత్యా, ఆత్మహత్యా తెలియాల్సి ఉందని ఏసీపీ బీఎస్‌ నేమెగౌడ్‌ చెప్పారు. దర్యాప్తు మొదలు పెట్టామని వెల్లడించారు. గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన రేష్మా రాత్రయినా ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్‌ స్విఛాఫ్‌ చేసి ఉండడంతో కుంటుంబ సభ్యులు కొల్హార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది.

రేష్మా మృతదేహం, పక్కన ఆమె ఫైల్‌ ఫోటో

మహారాష్ట్రకు చెందిన మజ్లిస్‌ పార్టీ నాయకుడి కారులో ఆమె వెళ్లినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్‌ విజయపుర జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన రేష్మా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరహిప్ప నియోజకవర్గం పోటీచేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ మరోమారు టికెట్‌ కేటాయించకపోవడంతో.. ఆమె కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీల‌కంగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న రేష్మా ఫలితాలు దగ్గర పడుతున్న సమయంలో ప్రాణాలు కొల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె మరణంపట్ల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దిగ్భాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు