మరణశిక్షణను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు
దక్షిణ కన్నడ జిల్లాలో అప్పట్లో
సంచలనం సృష్టించిన సీరియల్ హత్యలు
బనశంకరి : మహిళలను లైంగికంగా హింసించి అనంతరం వారిని సైనేడ్తో మట్టుబెట్టిన కిరాతకుడు, సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్కు కింది కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవితఖైదుగా మారుస్తూ గురువారం తీర్పుచెప్పింది. వివరాలు... దక్షిణ కన్నడ జిల్లాలో 2004 నుంచి 2009 వరకు 20 మంది మహిళలపై అతికిరాతకంగా అత్యాచారం అనంతరం వారిని సైనేడ్తో హత్య చేసిన మోహన్ కుమార్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో తీవ్ర సంచలనం రేగింది.
ఈ ఆరోపణలపై దక్షిణ కన్నడ జిల్లా 4వ అదనపు సెషన్స్ కోర్టు మోహన్కు మరణశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ సైనేడ్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తులు రవి మళిమఠ్, మైకన్కున్హా కేసు విచారణ చేసి మరణశిక్షను రద్దు చేసి జీవితఖైదుగా తీర్పు చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిందితుడిని బయటకు విడుదల చేయరాదని, అతడు సమాజంలో జీవించడానికి అర్హుడు కాదని, అతడిని క్షమించడానికి వీలు లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.