మద్యం, మాంసం రుచిచూపి.. ప్రియుడితో కలిసి

8 Dec, 2019 10:35 IST|Sakshi
నిందితులు గాయత్రి, యల్లప్ప

సాక్షి, కేజీఎఫ్‌: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి మృతదేహాన్ని కాల్చివేసిన భార్య ఉదంతం నగరంలోని బెమెల్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బంగారుపేట తాలూకా అనంతపుర గ్రామంలో వెంకటేష్‌(30) గాయత్రి (21)దంపతులు నివాసం ఉంటున్నారు. గాయత్రికి దాసరహొసహళ్లి గ్రామానికి చెందిన గారమేస్త్రి యల్లప్పతో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలుసుకున్న వెంకటేష్‌ గాయత్రిని హెచ్చరించాడు. అయినా ఆమె పద్ధతి మార్చుకోలేదు. దీంతో వెంకటేశ్‌ మద్యానికి బానిసై గాయత్రితో గొడవ పడేవాడు. ఎలాగైనా భర్త వెంకటేష్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడుతో కలిసి గాయత్రి పథకం రచించింది. గత నెల 24వతేదీన వెంకటేష్‌ను బెమెల్‌నగర్‌ మర్రిచెట్టు వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి మాంసం తినిపించింది.  అనంతరం  స్కూటీలో వెంకటేష్‌ను ఐమరసపుర అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లింది.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న యల్లప్ప వెంకటేష్‌ను కర్రతో తలపై బాది హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఉడాయించారు. అటవీ ప్రాంతంలో కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో మృతుడిని వెంకటేష్‌గా గుర్తించి అతని భార్య గాయత్రిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చినట్లు వెల్లడించడంతో గాయత్రిని, యల్లప్పను అరెస్ట్‌ చేశారు. అనంతరం నిందితులను ఘటనా స్థలానికి  తీసుకెళ్లి హత్యోదంతం తీరును తెలుసుకున్నారు. కాగా నిందితులను అరెస్ట్‌ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ  మహమ్మద్‌ సుజీత అభిందించారు.

చదవండి: మన్యంలో ఉపాధ్యాయురాలిపై మృగాడి వికృత చేష్టలు

మరిన్ని వార్తలు