‘మూర్ఖుడు.. ఏ శిక్ష వేసినా తప్పులేదు’

22 Dec, 2017 16:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన కొడుకు మూర్ఖంగా ప్రవర్తించాడని, అతడికి ఎటువంటి శిక్ష వేసినా అభ్యంతరం లేదని కార్తీక్‌ తల్లి ఊర్మిళ అన్నారు. శుక్రవారం ఆమె ఓ వార్తా చానల్‌తో మాట్లాడుతూ... తన కొడుకు చేసిన తప్పు మరొకరు చేయొద్దని వేడుకున్నారు. సంధ్యతో కార్తీక్‌కు చాలా రోజులుగా పరిచయం ఉందని తెలిపారు. సంధ్య అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేదని వెల్లడించారు.

కార్తీక్‌ తన సంపాదన మొత్తం సంధ్యకే ఇచ్చేవాడని, కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య దూరంగా పెరిగిందన్నారు. వారం క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడని వెల్లడించారు. సంధ్య వెంటపడొద్దని కొడుక్కి నచ్చజెప్పినట్టు తెలిపారు. సమస్యలుంటే పెద్దవారితో మాట్లాడుకుకోవాలని, ఇలాంటి దారుణాలకు దిగొద్దని కోరారు. ఓ అమ్మాయి ప్రాణం తీశాడు.. తల్లి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. కార్తీక్‌ను తానే తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పానని తెలిపారు.

గురువారం సాయంత్రం లాలాపేట్‌ విద్యామందిర్‌ సమీపంలో సంధ్యారాణిపై కార్తీక్‌ కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ప్రాణాలు విడిచింది. నిందితుడు కార్తీక్‌పై 307, 354డీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు