'మీ అక్క కోసమైనా తిరిగొచ్చేయ్‌రా నాన్నా'

9 Jan, 2018 10:05 IST|Sakshi

గన్‌ పట్టిన కశ్మీర్‌ పీహెచ్‌డీ స్కాలర్‌

ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్‌లో చేరిక

తిరిగొచ్చేయాలంటూ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

సాక్షి, శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో కనిపించకుండా పోయిన ఓ పీహెచ్‌డీ స్కాలర్‌ గన్‌ తో ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చాడు. అది కూడా ఉగ్రవాదులు ఉపయోగించే గన్‌తో కనిపించి. అంతేకాదు, అతడు తమ సంస్థలో చేరినట్లు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కూడా స్పష్టం చేసింది. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తోన్న మనన్‌ బషిర్‌ వాని ఇటీవలె ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు సైతం హైరానా పడుతున్న తరుణంలో అనూహ్యంగా అతడు ఏకే 47 గన్‌ పట్టుకొని ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో దర్శనం ఇచ్చింది.

దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర రోదనలో మునిగిపోయారు. మరోపక్క, అతడు ఉగ్రవాద సంస్థలో చేరినట్లు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన చీఫ్‌ సయ్యద్‌ సలావుద్దీన్‌ స్పందిస్తూ భారత్‌ నిర్లక్ష్యం కారణంగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా కశ్మీర్‌ యువత తమతో చేతులు కలుపుతోందంటూ ప్రకటన చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మనన్‌ తల్లి తిరిగి రావాలని మీడియా ద్వారా తన కుమారుడికి విజ్ఞప్తి చేస్తూ బోరున విలపించింది. 'నాన్న మనన్‌.. మీ అమ్మ ఏడుస్తోంది రా.. దయచేసి వెనక్కి వచ్చేయి. మీ అక్క పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూడు. మీ అక్క కోసం అయినా తిరిగొచ్చేయిరా.. నువ్వు ఎప్పుడూ మీ అక్కకు అండగా ఉన్నావు' అంటూ మనన్‌ తల్లి షమీమా రోధించింది.

మరిన్ని వార్తలు