లైంగిక వేధింపుల కేసు.. ఉచ్చు బిగుస్తోందా?

5 Dec, 2017 17:33 IST|Sakshi

సాక్షి, కొచ్చి : మళయాళ నటి భావనపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో స్టార్‌ నటుడు దిలీప్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. ఇందులో మొత్తం 12 మంది నిందితుల పేర్లను పోలీసులు ప్రస్తావించారు.

ఇక ఛార్జ్‌ షీట్‌ను అంగీకరించటంతోపాటు దిలీప్‌తోపాటు నిందితులందరికీ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే మొదటి ఛార్జీ షీట్‌ లో తొలుత ప్రధాన నిందితుడిగా దిలీప్‌ పేరును ప్రస్తావించిన పోలీసులు సరైన సాక్ష్యాలు లభింకపోవటంతో ఆయన పేరును 8వ నిందితుడిగా మార్చారు. ఆ ఛార్జ్‌షీట్‌ను నవంబర్‌ 22న అంగమళి మెజిస్ట్రేట్‌ కోర్టుకు సమర్పించారు. మొత్తం 650 పేజీల ఛార్జ్‌షీట్‌.. 50 మంది సాక్ష్యులు, 12 మంది నిందితుల పేర్లను ఇందులో ప్రస్తావించారు. దిలీప్‌ మాజీ భార్య మంజు వారియర్‌ పేరును ప్రధాన సాక్షిగా పేర్కొనటం విశేషం. ఆమె నుంచి కీలక సమాచారం విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఫిబ్రవరి 17న కోయంబత్తూరులో నటి భావనపై లైంగిక దాడి చోటు చేసుకోగా.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పల్సర్‌ సునీ, మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చివరకు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా దిలీప్‌ను జూలైలో అరెస్ట్‌ చేశారు. సుమారు 3 నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన ఈ స్టార్‌ హీరో అక్టోబర్‌ 3న ఎట్టకేలకు బెయిల్‌ మీద విడుదలై బయటకు వచ్చాడు. 

మరిన్ని వార్తలు