కల్కి భగవాన్‌ ఆశ్రమంలో కీలక ప్రతాలు స్వాధీనం

18 Oct, 2019 14:13 IST|Sakshi

మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

సాక్షి, తిరుపతి : కల్కి భగవాన్‌ ఆశ్రమంలో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే భారీగా అక్రమాస్తులను ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. కీలక పత్రాలను, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. కల్కి ఆశ్రమం వ్యవస్థాపకులు విజయ్‌ కుమార్‌, పద్మావతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధికారులు చేపట్టిన తనిఖీల్లో క్యాంపస్‌-3లో భారీగా విదేశీ నగదు, బంగారాన్ని గుర్తించినట్లు  సమాచారం. ఈ మేరకు కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణ నాయుడు, కోడలు ప్రీతినాయుడు, ట్రస్ట్‌ నిర్వహకుడు లోకేష్‌ దాసాజీని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్వదేశీ, విదేశీ భక్తుల ద్వారా భారీ ఎత్తున విరాళాలు సేకరించి.. వందల ఎకరాలు, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు. 
 
ఈ అంశంపై సత్యవేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. కల్కి భగవాన్‌ ఆశ్రమంపై మరింత లోతుగా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని, భగవాన్‌ కబంధ హస్తాల్లో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అజ్ఞాతంలో ఉన్న విజయ్‌ కుమార్‌, పద్మావతిని అదుపులోకి తీసుకొని విచారించాలని, ఆశ్రమంలో ఉన్న విదేశీ నగదుపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

చదవండి : ‘కల్కి భగవాన్‌’ పై ఐటీ దాడులు

          ‘ఏకం’లో కల్కి భగవాన్‌ గుట్టు?

మరిన్ని వార్తలు