ఏపీజీవీబీ చైర్మన్‌ కిడ్నాప్‌నకు యత్నం

26 Jul, 2018 12:39 IST|Sakshi
ఏపీజీవీబీ చైర్మన్‌ నర్సిరెడ్డి, మెడ గాయాన్ని చూపుతున్న డ్రైవర్‌ నవీన్‌ 

కారులో అటకాయించిన నలుగురు దుండగులు

అప్రమత్తమై..ఆర్టీసీ బస్సు ఎక్కి బయటపడిన వైనం

తిరుమలాయపాలెం మండలంలో ఘటన

తిరుమలాయపాలెం : ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణవికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) చైర్మన్‌ వి.నర్సిరెడ్డిని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్ద కిడ్నాప్‌ చేసేందుకు నలుగురు దుండగులు యత్నించిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సిరెడ్డి అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రసాద్‌తో కలిసి బుధవారం ఉదయం కొత్తగూడెంలో గ్రామీణ బ్యాంక్‌ రీజినల్‌ స్థాయి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం..ఖమ్మం రీజినల్‌ ఆఫీస్‌లో బ్యాంక్‌ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలప్పుడు తన ఇన్నోవా వాహనంలో వరంగల్‌ బయల్దేరారు. ఈయన ఖమ్మంతో పాటు 8 జిల్లాలకు బ్యాంక్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా..హెడ్డాఫీస్‌ వరంగల్‌ కావడంతో అక్కడికి వెళుతున్నారు.  తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్దకు రాగానే వెనుక నుంచి ఓ కారు హారన్‌ కొడుతూ ఈయన వాహనాన్ని  ఓవర్‌టేక్‌ చేసేందుకు తరచూ యత్నిస్తూ, ఓ సారి వెనుకనుంచీ ఢీకొట్టడంతో ఆగిపోయారు.

కారులోంచి దిగిన నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఒక్కసారిగా వీరి వద్దకు వచ్చి..డ్రైవర్‌ను వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. తాము చైర్మన్‌ను కిడ్నాప్‌ చేస్తామని బెదిరించారు. డ్రైవర్‌ భయంతో అరవడంతో..చైర్మన్‌ తన వాహనంలోంచి ఒక్క ఉదుటున బయటికి రావడం..అదే సమయంలో వరంగల్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లి చేతులెత్తడంతో అది ఆగింది. దీంతో..ఆయన అందులోకి ఎక్కి మరిపెడ (బంగ్లా)లో దిగి..పోలీసులను ఆశ్రయించారు.

వారు చైర్మన్‌ను తీసుకొచ్చి.. సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించి, ఇది తమ పరిధి కాదని, తిరుమలాయపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. చైర్మన్‌ బస్సును ఆపుజేయడంతోటే నిందితులు కారును వదిలి పరారయ్యారు. ఆ వాహనంలో దాడి చేసేందుకు వినియోగించే దొడ్డు కర్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కారును తిరుమలాయపాలెం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తనకు వ్యక్తిగత కక్షలు లేవని, పాలనాపరంగా సిబ్బందిపై చర్యలు తీసుకోవడం తప్పా..తానెవరిపై వ్యక్తిగతంగా కక్ష కట్టలేదని, ఈ కిడ్నాప్‌ యత్నం ఎందుకు జరిగిందో, ఎవరు చేయజూశారో అర్థం కావట్లేదని చైర్మన్‌ నర్సిరెడ్డి వివరించారు.

కారులోని కాగితాలను పరిశీలించగా.. ఉసిళ్ల రవీందర్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ అయినట్లుగా గుర్తించారు. చైర్మన్‌ నర్సిరెడ్డి ఫిర్యాదు మేరకు..ఏసీపీ నరేష్‌రెడ్డి, కూసుమంచి, ఖమ్మం రూరల్‌ సీఐలు వసంతకుమార్, తిరుపతిరెడ్డి, ఎస్‌ఐ సర్వయ్య అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

చంపేస్తామని బెదిరించారు..

ఎన్ని డబ్బులైనా ఇస్తామని, చైర్మన్‌ను వదిలేయాలని బెదిరించినా తి రగబడి ఎదిరించా. వాళ్లు  నా∙మెడను గట్టిగా పట్టుకుని, పర్సును కూడా లాక్కెళ్లారు.

మరిన్ని వార్తలు