యువతి కిడ్నాప్‌నకు యత్నం

2 Nov, 2018 07:47 IST|Sakshi
గాయపడిన నాగరాజు

అడ్డుకున్న స్థానికులు

అనంతపురం, తాడిపత్రి అర్బన్‌: ఓ యువతిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు అడ్డుకున్న సంఘటన గురువారం తాడిపత్రి పట్టణంలోని జీడీఆర్‌ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... తాడిపత్రి పట్టణంలోని జీడీఆర్‌ నగర్‌లో నివాసముంటున్న లక్ష్మిదేవి, శ్రీధర్‌బాబుల కుమార్తె రజిత ఇంటివద్ద కూర్చుని ఉండగా గురువారం నంద్యాల పట్టణం వైఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి వచ్చి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుపడ్డ తల్లి కళ్లలో కారం చల్లాడు.

ఇది గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. వారి కళ్లల్లో కూడా కారం కొట్టబోయాడు. అయితే దారు నాగరాజును చాకచక్యంగా పట్టుకున్నారు. రజిత బంధువులు కొందరు అతడిని పట్టణ శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి కొట్టడంతో తీవ్రగాయాలయ్యయి. స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. నాగరాజు గతంలో కూడా రజితను తీసుకెళ్లినట్లు ఈ ఏడాది జూన్‌లో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజిత కర్నూలు జిల్లా మహానందిలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదువుతున్న సమయంలో నాగరాజుతో చనువు ఏర్పడింది. ఇది తెలిసిన తల్లిదండ్రులు చదువు మానిపించి కుమార్తెను ఇంటివద్ద ఉంచుకున్నారు. ప్రస్తుతం రజిత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు