కిడ్నాపైన శిశువు బీదర్‌లో ప్రత్యక్షం

3 Jul, 2018 17:34 IST|Sakshi
పాపను ఎత్తుకున్న సుల్తాన్ బజార్ ఏసీపీ చేతన

సాక్షి, హైదరాబాద్‌: కోఠిలోని సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కిడ్నాప్‌ చేసిన మహిళ, బీదర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో శిశువును వదిలి పారిపోయింది. విషయం తెలియడంతో సుల్తాన్‌ బజార్‌ ఏసీపీ చేతన పోలీసులతో బీదర్‌ చేరుకుని పాపను స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆరు రోజుల పసికందు సోమవారం మధ్యాహ్నం అదృశ్యమైన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ, ప్రసూతి కోసం గతవారం ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చారు.

ఆమె కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో.. పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని ఓ మహిళ ఈ విషయం గమనించి.. శిశువుకు టీకా ఇప్పిస్తానంటూ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తన బిడ్డను తీసుకురాకపోవడంతో విజయ తల్లిడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిశువును అపహరించిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నించారు.

రెండు రోజులుగా మహిళా కిడ్నాపర్‌ కోసం మూడు బృందాలు తీవ్రంగా గాలించాయి. ఈ విషయం తెలిసి భయపడిపోయిన మహిళా కిడ్నాపర్‌, శిశువును బీదర్‌లోని ఆసుపత్రిలో వదిలి వెళ్లడంతో కథ సుఖాంతం అయింది. మహిళా కిడ్నాపర్‌ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు చేపడుతున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా మహిళను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.శిశువు దొరకడంతో తల్లి విజయ సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. పోలీసులు ఆమెకు శిశువును వీడియో చాట్‌ ద్వారా చూయించడంతో ఆనందం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు