దారుణం : ఉద్యోగం ఇప్పించలేదని.. కత్తితో..!

16 Nov, 2017 17:26 IST|Sakshi

సాక్షి, మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిపై బాధితుడు కత్తితో దాడికి దిగాడు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా, మదన పల్లికి చెందని  ఫరూక్‌ గల్ఫ్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. తన దగ్గరికి వచ్చిన వారికి గల్ఫ్‌ దేశాల్లో వీసాతో పాటు ఉద్యోగం ఇప్పిస్తానని చెబుతూ ఉండేవాడు.

అదే మదనపల్లికి చెందిన విశ్వ కూడా గల్ఫ్‌లో ఉద్యోగం కోసం ఫరూక్‌ను సంప్రదించాడు. అయితే ఇందుకోసం రెండు లక్షలు ఖర్చవుతందని ఫరూక్‌ చెప్పడంతో అంత మొత్తాన్ని చెల్లించిన విశ్వ గల్ఫ్‌ వెళ్లిపోయాడు. అక్కడ వెళ్లిన తర్వాత విశ్వకు అసలు విషయం అర్థం అయింది. దిక్కు మొక్కులేని చిన్న కంపెనీలో అతి తక్కువ జీతానికి తనను నియమించినట్లు అర్థం చేసుకున్న విశ్వ, కొద్ది కాలం తర్వాత ఇండియాకు తిరిగి వచ్చాడు. వచ్చీరాగానే ఏజెంట్ ఫరూక్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం సంఘటనా స్థలం నుంచి విశ్వ పారిపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఫరూక్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు