ప్లేట్‌లో ఎంగిలి నీళ్లు పడ్డాయని..

27 Jun, 2019 09:05 IST|Sakshi

కత్తితో యువకుడి దాడి ముగ్గురికి గాయాలు

అమీర్‌పేట: ప్లేట్‌లో ఎంగిలి నీళ్లు పడ్డాయన్న కోపంతో ఓ యువకుడు కత్తితో ముగ్గురిపై దాడికి పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.ఎస్సై మహేందర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లాకు చెందిన మహేష్‌బాబు తన స్నేహితులు రాకేష్, శివతేజ, ఆనంద్‌ తేజలతో కలిసి బీకేగూడలోని  హిమాలయ డీలక్స్‌ బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటూ సీఏ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం మహేష్‌బాబు నల్లా వద్ద ప్లేటు కడుగుతుండగా నీళ్లు సమీపంలో ఉన్న శ్రీనివాస్‌ అనే యువకుడిపై పడ్డాయి.

దీంతో ఇద్దరి మధ్య  వాగ్వాదం జరగడంతో స్నేహితులు జోక్యం చేసుకుని వారికి సర్ధి చెప్పారు. అనంతరం ఎవరి గదిలో వారు నిద్రిస్తుండగా కిచెన్‌లోకి వెళ్లిన వెంకటేష్‌ కూరగాయలు తరిగే కత్తి తీసుకుని వచ్చి మహేష్‌తో పాటు రాకేష్, శివతేజ, ఆనంద్‌ తేజపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. హాస్టల్‌ నిర్వాహకుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి  తలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు.

మరిన్ని వార్తలు