ప్రేమించలేదని వివాహితపై దాడి

25 Feb, 2019 11:18 IST|Sakshi

కత్తితో పొడిచిన వ్యక్తి అరెస్ట్‌

చెన్నై , తిరువొత్తియూరు: ప్రేమించలేదని వివాహితపై దాడిచేసిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. చెన్నై అరుంబాక్కం రాణి అన్నానగర్‌ నావలర్‌ వీధికి చెందిన శరణ్య (26) అదే ప్రాంతంలోని బ్యూటీపార్లర్‌లో పనిచేస్తోంది. ఆరేళ్ల క్రితం వివాహమైన ఈమెకు ఒక కుమార్తె(5) ఉంది. ఈ క్రమంలో ఏడాదిగా భర్త నుంచి విడిపోయి జీవిస్తోంది. శరణ్య పనిచేస్తున్న చోటే విక్టర్‌ (41) నిర్వాహక విభాగంలో పనిచేస్తున్నాడు.

ఇతనికి ఇంకా వివాహం కాలేదు. ఓటేరి నమ్మాళ్వార్‌ పేటలో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలలుగా శరణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమించమని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అందుకు శరణ్య ఒప్పుకోకపోగా తిరిగి ఆమె నెల రోజులుగా భర్తతో కలిసి ఉంటోంది. విషయం తెలుసుకున్న విక్టర్‌ శనివారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్‌ వద్దకు వెళ్లి శరణ్యను ప్రేమించమని బలవంతం చేశాడు. ఆమె తిరస్కరించడంతో తాన వెంట తెచ్చుకున్న కత్తితో శరణ్య గొంతు భాగంలో పొడిచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శరణ్యను చికిత్స నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై కేసు నమోదు చేసి ఓటేరిలో ఉన్న విక్టర్‌ను ఆదివారం అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు