నాంపల్లిలో భయం..భయం..

22 Apr, 2019 08:11 IST|Sakshi

రెచ్చిపోతున్న పోకిరీలు, హిజ్రాలు  

ఆదివారం మధ్యాహ్నం డబ్బుల కోసం ఘర్షణ

ఒకరికి కత్తిపోట్లు, ఆసుపత్రికి తరలింపు

నాంపల్లి: హైదరాబాదు రైల్వే స్టేషన్‌ ఎదుట పోకిరీల బెడద ఎక్కువైపోంది. నానాటికి వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అటు సందర్శకులను ఇటు పోలీసులను బెంబేలెత్తిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్, పబ్లిక్‌గార్డెన్‌ గేటును అడ్డాగా చేసుకుని జీవిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిలోఫర్‌ ఆసుపత్రి వద్ద దాతలు వడ్డించే భోజనాలు స్వీకరిస్తారు. భోజనాలు ఆరగించిన పోకిరీలు నాంపల్లి సరాయికి చేరుకుంటారు. అక్కడే చెట్ల కింద సేదతీరుతూ వచ్చి పోయే వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. సరాయి పక్కనే ఉండే మోతి వైన్స్‌ దగ్గర ప్రయాణికుల జేబులు, ఎండ వేడిమికి చెట్ల కింద సేదతీరే సందర్శకుల జేబులను కొట్టేస్తుంటారు. ఇలా కొట్టేసిన డబ్బు పంచుకునే క్రమంలో విభేదాలు వచ్చి హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతారు. గడచిన ఏడాది కాలంలో మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు జరిగాయి. హత్యలు చేసిన పోకిరీలు పరావుతుంటారు. పరారైన వారిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. 

ఇక రాత్రి వేళల్లో ట్యాక్సీ స్టాండ్‌ కేంద్రంగా హిజ్రాలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. తమ దగ్గరకు వచ్చిన విటులను ఒళ్లును గుల్ల చేసి పంపుతున్నారు. కాదు కూడదంటే దౌర్జాన్యాలకు పాల్పడి చంపేస్తున్నారు. మితిమీరిపోతున్న పోకిరీలు, హిజ్రాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. వీరి స్థావరాలపై దాడులు చేసి నాంపల్లిలో నిలువకుండా చూడాలని  పలువురు కోరుతున్నారు. అలాగే నిలోఫర్‌ ఆసుపత్రి ఎదుట అన్నదానాలు చేసే దాతలు రోగి సహాయకులకు కాకుండా పోకిరీలకు అన్నం వడ్డించకుండా చర్యలు తీసుకోవాలి.  అంతేకా>కుండా నాంపల్లి రైల్వే స్టేషన్‌ ఎదుట అధునాతన భవన నిర్మాణం పేరుతో కూల్చివేసిన ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్, లా అండ్‌ ఆర్డర్‌ ఔట్‌ పోస్టు ఉండేందుకు భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి.

స్టేషన్‌ ఎదుట గుర్తుతెలియని వ్యక్తిపై కత్తితో దాడి...  
ఆదివారం మధ్యాహ్న పోకిరీలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యారు. గాయాలపాలైన వ్యక్తిని హుటా హుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి కోసం నాంపల్లి పోలీసులు గాలిస్తున్నారు. దాడిలో గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు