పెళ్లి విందులో అల్లుడి వీరంగం

4 Jun, 2019 09:31 IST|Sakshi

కత్తితో ముగ్గురిపై దాడి నిందితుడి అరెస్ట్‌

లంగర్‌హౌజ్‌: పెళ్లి విందులో ఓ యువకుడు వీరంగం సృష్టించిన సంఘటన సోమవారం లంగర్‌హౌజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లంగర్‌హౌజ్‌ మందుల బస్తీకి చెందిన ముత్యం(35)కు మూడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన రజినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న ముత్యం తరచూ ఆమెను వేధిస్తున్నాడు. భర్త  వేధింపులు భరించలేక రజిని ఈ విషయాన్ని తన మేన మామల దృష్టికి తీసుకెళ్లింది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి లంగర్‌హౌజ్‌లో జరిగిన రజిని బంధువుల పెళ్లి విందుకు ముత్యం కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రజిని మేనమామలు అతడిని నిలదీయడంతో ముత్యం  వారితో వాగ్వాదానికి దిగడమేగాక తన వెంట తెచ్చుకున్న పేపర్‌ కట్టింగ్‌ కత్తితో వారిపై దాడి చేసి గాయపరిచాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసు లు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు