వ్యక్తిగత కక్షలే కారణం
పరారీలో నిందితుడు
కర్నూలు, మహానంది/బొమ్మలసత్రం: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బి.భక్తశేషారెడ్డిపై అదే గ్రామానికి చెందిన కుంపటి శ్రీకాంత్ అనే యువకుడు సోమవారం రాత్రి కత్తితో దాడి చేశాడు. భక్తశేషారెడ్డి స్థానిక టైలర్ శ్రీనివాసులు షాప్ వద్ద ఉండి ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి వచ్చి కత్తితో పొడిచాడు. స్థానికులు వెంటనే అడ్డుకోవడంతో పెద్దప్రమాదం తప్పింది. కత్తిపోట్లకు గురైన భక్తశేషారెడ్డిని బంధుమిత్రులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్లారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్లినట్లు ఆయన సోదరుడు మహానంది దేవస్థానం మాజీ చైర్మన్, మండల మాజీ అధ్యక్షుడు నాగభూపాల్రెడ్డి తెలిపారు. కత్తితో దాడిచేసిన శ్రీకాంత్ గతంలో భక్తశేషారెడ్డికి తెలిసిన పుట్టపర్తికి చెందిన డాక్టర్ వద్ద పనిచేసేవాడు. అయితే కొన్ని కారణాలతో అక్కడ నుంచి శ్రీకాంత్ను ఇంటికి పంపించారు. దీంతో భక్తశేషారెడ్డిపై వ్యక్తిగత కక్ష పెంచుకొని దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. మహానంది ఎస్ఐ తులసీనాగప్రసాద్ వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.