‘కోడెలను కొడుకే హత్య చేశాడు’

20 Sep, 2019 14:56 IST|Sakshi
కోడెల శివప్రసాదరావు (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, దీంతో చంద్రబాబుకు సంబంధం ఉందని గుంటూరు జిల్లాకు చెందిన బొర్రుగడ్డ అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి ఆరోపించారు. కోడెల మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్ సీఐని ప్రతివాదులుగా చేర్చారు. కోడెల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, కుట్ర కోణం దాగుందని పిటిషనర్‌ ఆరోపించారు.

కోడెల శివప్రసాదరావు అభిమానిగా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పిల్‌ వేసినట్టు అనిల్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని అన్నారు. రాజకీయ నాయకులపై కేసులు సహజమని, దానికే భయపడిపోయి ఆయన ఆత్మహత్య చేసుకుంటారని తాము భావించడం లేదన్నారు. కోడెలది కచ్చితంగా రాజకీయ హత్యేనని, దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. కోడెల మృతి వెనుక ఆయన కుమారుడు శివరామ్‌ హస్తం ఉందని వంద శాతం నమ్ముతున్నట్టు తెలిపారు. అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న చేసిన శివరామ్‌ కేసుల నుంచి తప్పించడం కోసం తండ్రిని హత్య చేయించివుంటాడన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కోడెల మరణం వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టును అభ్యర్థించినట్టు చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. (చదవండి: శివరామ్‌ విచారణకు రంగం సిద్ధం)

మరిన్ని వార్తలు